జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : బ్రతుకుతెరువు కోసం గత కొన్నేళ్లుగా ఒక రోడ్డు ప్రక్కన చిన్న కల్లు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. దుకాణంలో తన భార్యతో కలిసి వ్యాపారం చేసుకుంటూ కల్లు అమ్మగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో భార్యాపిల్లలతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి కల్లు దుకాణం వద్ద ఆగాడు. కారు పార్క్ చేసి కారులో నుండి దిగి దుకాణంలోకి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి చేతిలో ఒక తుపాకీ కూడా ఉంది. చేతిలో తుపాకీ ఉండటంతో కల్లు దుకాణ యజమాని ముందు ఒకింత భయపడ్డాడు. తరువాత ఆ వ్యక్తి కల్లు త్రాగడం కోసం వచ్చాడని తెలుసుకొని ఊపిరి పీల్చుకొని అతను అడిగినట్లు కల్లు ఇచ్చాడు. అయితే కల్లులో కిక్ ఇచ్చేందుకు దుకాణ యజమాని నాయుడు కొద్దిపాటి మత్తు పదార్థంకు చెందిన రసాయనాలు కలుపుతుండేవాడు. రసాయనాల వల్ల ఆ దుకాణంలో కల్లు తాగిన వారికి కిక్కు కూడా ఎక్కువగానే ఉండేది. మత్తు పదార్ధాలు కలుపుతారని తెలియని ఆ వ్యక్తి కల్లు ఎక్కువగా త్రాగాడు. దీంతో కిక్ బాగా ఎక్కిన ఆ వ్యక్తి అదే మైకంలో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్లే క్రమంలో తనతో తెచ్చుకున్న గన్ అక్కడే వదిలి వెళ్లిపోయాడు. గన్ మరిచిపోయి వెళ్లిన వ్యక్తి గన్ కోసం మళ్లీ వస్తాడనుకుంటే తిరిగి ఎప్పటికీ రాలేదు. దీంతో ఆ గన్ ను జాగ్రత్తగా తన కల్లు పాకలోనే దాచి ఉంచాడు. అలా సుమారు రెండేళ్లు గడిచింది. ఈ క్రమంలోనే తన కల్లు వ్యాపారం కూడా తగ్గుముఖం పట్టింది. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో సంపాదన కోసం కొత్త దార్లు వెతికాడు. కల్లు దుకాణం నడుపుకొని వచ్చే చాలీచాలని డబ్బుతో ఎన్నాళ్లు భార్యాపిల్లలతో కష్టంగా బ్రతకాలి? ఏదో ఒక రిస్క్ చేసైనా బాగా సంపాదించాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ సమయంలోనే తనకు ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది. అంతే టక్కున మద్యం మత్తులో ఒక వ్యక్తి వదిలేసి వెళ్లిన గన్ గుర్తొచ్చింది. దీంతో అసలు కల్లు అమ్మడం కాదు ఖల్ నాయక్ లా మారాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక అంతే అనుకోకుండా తన చేతికి చిక్కిన గన్ కు పనిచెప్పాడు. బలవంతపు వసూళ్లు, సెటిల్మెంట్స్ కి దిగాడు. దీంతో అప్పటి వరకు కల్లు అమ్ముకుంటూ బ్రతుకుతున్న ఆ దుకాణ యజమాని వ్యవహారంలోనూ, హావభావాల్లో కూడా మార్పు వచ్చింది. కల్లు దుకాణ యజమానిగా ఎప్పటి నుండో చూస్తున్న కల్లు అమ్ముకొని బ్రతికే వ్యక్తి సడన్ గా ఇలా మారడానికి గల కారణమేంటో స్థానికులకు ఎవరికి అంతు పట్టలేదు. పగలు కల్లు అమ్ముకుంటున్నట్టు నటిస్తూ, రాత్రి వేళ అటుగా వచ్చే వాహనాలను ఆపి వాహనదారులకు గన్ చూయించి బలవంతపు వసూళ్లకు దిగడం ప్రారంభించాడు. అలా కొన్నాళ్లుగా అతని చీకటి దందా నడిపిస్తూ ఖల్ నాయక్ పాత్ర గట్టిగానే పోషించాడు. Nithari Murder Case: నిఠారీ సీరియల్ మర్డర్ కేసుల్లో అల్హాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు! ఇదే క్రమంలో ఒక రోజు రాత్రి అటుగా వస్తున్న ఒక లారీని ఆపి డ్రైవర్స్ వద్ద ఇదే తరహా దందాకి దిగాడు. దీంతో డ్రైవర్స్ కూడా తీవ్రంగా ప్రతిఘటించి అక్కడ నుండి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం జామి మండల పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కల్లు దుకాణ యజమాని లగుడు నాయుడును అదుపులోకి తీసుకొని లోతైన దర్యాప్తు చేపట్టారు. అసలు గన్ తో వచ్చిన వ్యక్తి ఎవరు? అతను ఎలా ఉంటాడు? ఎందుకు గన్ ను కల్లు దుకాణంలో వదిలి వెళ్లాడు అని అనేక ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా దొరికిన గన్ ను ఎందుకు పోలీసులకు అప్పగించలేదు? ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దందాలు చేశావు? ఎంత సంపాదించావు వంటి అనేక అంశాల పై విచారించారు. అంతేకాకుండా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన కల్లు దుకాణ యజమాని చెప్పిన అనేక ఆసక్తికర అంశాలతో పోలీసులే విస్తూపోయారు. అనంతరం పోలీసులు కటకటాలకు పంపారు. విజయనగరం జిల్లా జామి మండలం గదబపాలెంలో కల్లు అమ్ముకుంటూ ఖల్ నాయక్ గా మారిన లగుడు నాయుడు వ్యవహారం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Admin