జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో ముందుండేది కార్యకర్తలే.. అలాగే అధినేత నిర్ణయం ఏదైనా బలంగా ముందుకు తీసుకెళ్లేది కార్యకర్తలే.. అలాగే అధినేత ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే హార్డ్ కోర్ నాయకులు పార్టీకి అత్యవసరం. రాజకీయ రణక్షేత్రంలో మారుతున్న సమీకరణాలు, ఓటర్ల మనోగతం, పార్టీ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ.. పార్టీ పెద్దలు ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న వ్యూహం కూడా ఇదే. ప్రస్తుతం పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. వైసీపీని ఓడించమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో జత కట్టారు.. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహం కొంతమంది సొంత పార్టీ లీడర్లకు నచ్చడం లేదు. టీడీపీతో జనసేన పార్టీ పొత్తు నచ్చని నాయకులు పార్టీని వీడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీకి బలంగా వాయిస్ వినిపించిన మాజీ అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర టీడీపీతో కలిసి పని చేయలేమని.. ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ తమ అభిమాన నాయకుడు అని చెబుతూ పార్టీకి దూరం జరిగారు.. ఈ పరిణామం పార్టీ జెండాలు మోస్తున్న యువతను నిరుత్సాహపరిచింది.. పార్టీ గొంతును బలంగా వినిపించే యువతకు కళ్యాణ్ దిలీప్ సుంకర ఇన్పుట్స్ యువతకు చాలా ఉపయోగపడేవి.. ఇప్పుడు ఆ గొంతు సైలెంట్ అవడంతో కొంత నష్టం అయితే కనపడుతుంది. కళ్యాణ్ దిలీప్ సుంకర విషయం మర్చిపోకుండానే.. జనసేనకు మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేయడంతో.. కార్యకర్తలు ఇంకాస్త నైరాశ్యానికి లోనయ్యారు. ‘పవన్ అన్న ప్రజా బాట’ పేరిట నెల్లూరు సిటీలో గడపగడపకు తిరిగారు కేతన్ రెడ్డి.. అంతేకాదు 2024 సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఏకంగా సీఎం పవన్ కల్యాణ్ అంటూ శిలాఫలకం వేసి వార్తల్లోకి ఎక్కారు. నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. కానీ అధినేత పొత్తు నిర్ణయంతో నొచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతూనే.. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేతంరెడ్డి లాంటి నాయకుడిని దూరం చేసుకోవడం ఇష్టం లేదు.. కానీ పొత్తు ధర్మం ఆయన చేతులను కట్టేసింది.. అక్కడ మాజీ మంత్రి నారాయణ బలంగా ఉన్నారు.. అంతేకాదు టీడీపీ తరఫున పోరాడుతూ అనేక కేసుల సైతం ఎదుర్కొంటున్నారు.. మూడు నెలల ముందే నెల్లూరు సిటీపై ఆయనకు అధిష్టానం సీట్పై హామీ ఇచ్చింది.. దీంతో ఆయనకే ఆ సీటు దక్కుతుంది.. దీంతో జనసేన నుండి ఎలాంటి హామీ లభించకపోవడం పార్టీ కోసం పోరాడుతున్న తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని.. మనస్థాపం చెంది పార్టీని వీడారు కేతం రెడ్డి వినోద్ రెడ్డి.. అలాంటి నాయకుడిని పోగొట్టుకోవడంతో జనసేన కార్యకర్తలు ఎంతో నిరాశకు గురయ్యారో వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతుంది.
Admin