జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : కుక్కలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు కొందరు. వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ఎంతో ఆప్యాయంగా పెంచుతారు. వాటికి ఏమన్నా అయితే అస్సలు తట్టుకోలేరు. పెట్ డాగ్స్కు చిన్న సమస్య వచ్చినా వెటర్నరీ డాక్టర్స్ దగ్గరకు పరుగులు తీస్తారు. ప్రస్తుతం పెంపుడు జంతువులు అనారోగ్యం బారిన పడితే వైద్యం చేయించే వారి సంఖ్య కూడా పెరిగడంతో.. యానిమల్ డాక్టర్స్ సంఖ్య కూడా రెట్టింపైంది. ఇందులో భాగంగానే మూత్రాశయంలో రాళ్లుండి అనారోగ్యానికి గురైన కుక్కకు శస్త్ర చికిత్స చేసి రాళ్లు తొలగించిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన గుమ్మిడి శేషగిరిరావు లాబ్రడార్ రీట్రివర్ డాగ్ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం దాని వయస్సు ఏడు సంవత్సరాలు. గత ఏడేళ్లుగా పెంచుకున్న కుక్క ఈ మద్య కాలంలో అనారోగ్యానికి గురైంది. యూరిన్ సరిగా పోయకపోవడం, పోసే సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడటం, ఆహారం కూడా సరిగా తీసుకోకపోవడాన్ని శేషగిరిరావు గమనించారు. దీంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాలనుకున్నారు. ఆయన తన పెట్ డాగ్ను తీసుకుని విజయవాడకు చెందిన డాక్టర్ కామని శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లారు. రోగ లక్షణాలు తెలుసుకున్న డాక్టర్ మరిన్ని వైద్య పరీక్షలు చేయించారు. చివరకు మూత్రశయం, మూత్ర నాళంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం గత నెల 28న శస్త్ర చికిత్స చేసి దాదాపు 252 రాళ్లను తొలగించారు. ఆపరేషన్ తర్వాత కుక్క పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం ఆ శునకం కోలుకుని.. ఆహారం కూడా మంచిగా తీసుకోవడంతో శేషగిరిరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సమస్యను గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తమ పెంపుడు జంతువుకు కాపాడిన డాక్టర్కు ధన్యవాదాలు తెలిపారు.
Admin